Tuesday, July 23, 2019

మహేష్.. సెంటిమెంట్లకు దాసుడైపోయాడా?

సినీ రంగంలో సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ. బహుశా మరే రంగంలోనూ ఇంత దారుణమైన సక్సెస్ రేట్ ఉండదేమో. అందుకే ఇక్కడ సెంటిమెంట్లకు విలువ చాలా ఎక్కువ. చాలా ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్లు సైతం చిన్న చిన్న సెంటిమెంట్లను శ్రద్ధగా పాటిస్తుంటారు. మహేష్ బాబు కూడా అందుకు మినహాయింపు కాదనిపిస్తోంది.

తన కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ విషయంలో సూపర్ స్టార్ సెంటిమెంట్లను గట్టిగా నమ్ముకున్నట్లున్నాడు. ఈ సినిమలో మహేష్ అజయ్ కృష్ణ అనే పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ అనే పాత్రను ఇంతకుముందు బ్లాక్‌బస్టర్ మూవీ ‘దూకుడు’లో పోషించాడు మహేష్. ‘దూకుడు’ను మహేష్ ఎంత స్పెషల్‌గా చూస్తాడో పలు సందర్భాల్లో రుజువైంది. ఆ సినిమాలోని పాత్ర పేరు పెట్టుకోవడం సెంటిమెంట్లో భాగమే.

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’కు సంబంధించి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. రెండో షెడ్యూల్ కోసం కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్‌ను తీర్చిదిద్దుతున్నారట. మహేష్ కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అయిన ‘ఒక్కడు’ సినిమాలోని కీలక సన్నివేశాల్ని కొండారెడ్డి బురుజు దగ్గరే చిత్రీకరించారు. అదే సెంటిమెంటుతో ‘సరిలేరు నీకెవ్వరు’కు కూడా కర్నూలు బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

‘ఒక్కడు’ టైంకి మహేష్ పెద్ద స్టారేమీ కాదు. సింపుల్‌గా అక్కడికే వెళ్లి చిత్రీకరణ జరిపారు. కానీ ఇప్పుడు మహేష్ పెద్ద సూపర్ స్టార్. రియల్ లొకేషన్లలో షూటింగ్ అంటే చాలా కష్టం. అందుకే రామోజీ ఫిలిం సిటీలో కొండారెడ్డి బురుజు సెట్టింగ్ వేసి షూట్ చేయబోతున్నారు. మొత్తాన్ని తన కెరీర్లో బ్లాక్ బస్టర్ల సెంటిమెంట్లను ఫాలో అవుతూ మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవాలని మహేష్ పట్టుదలతో ఉన్నట్లుంది.

No comments:

Post a Comment