Tuesday, July 9, 2019

జులై 12.. అందరికీ టెన్షనే

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మళ్లీ కొంచెం ఊపు కనిపిస్తోంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'బ్రోచేవారెవరురా'.. 'ఓ బేబీ'.. ఇలా ఒక్కో వారానికి ఒక్కో సినిమా ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. వీటికి మంచి వసూళ్లే దక్కాయి. ఇక ఈ వారం రెండు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ రెండు చిత్ర బృందాలకు అది చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రాలు. ఇద్దరు కొత్త దర్శకులు రూపొందిస్తున్న ఈ చిత్రాలు ప్రధాన పాత్రధారుల కెరీర్లను నిర్దేశించేవి కావడం గమనార్హం. వాళ్ల కెరీర్లకు ఈ సినిమాల్ని పరీక్షగా చెప్పొచ్చు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన 'నిను వీడని నీడను నేనే' అతడికి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మినహాయిస్తే తెలుగులో అతడికి నిఖార్సయిన హిట్టే లేదు. అందులోనూ గత మూణ్నాలుగేళ్లలో అతడికి ఓ మోస్తరు సినిమా కూడా లేదు. వరుస ఫ్లాపులతో అల్లాడిపోయాడు. మార్కెట్ దాదాపుగా జీరో అయింది. ఇలాంటి సమయంలో సొంతంగా డబ్బులు పెట్టి 'నిను వీడని నీడను నేనే' చేశాడు. ఈ హార్రర్ థ్రిల్లర్ టీజర్, ట్రైలర్ బాగానే అనిపించాయి. కార్తీక్ రాజు అనే కొత్త దర్శకుడు రూపొందించాడీ చిత్రాన్ని. ఇది ఆడకుంటే సందీప్ కిషన్ కెరీర్ క్లోజ్ అన్నట్లే. ఇక ఈ వారం రాబోతున్న 'దొరసాని' సినిమా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఆనంద్ దేవరకొండ, శివాత్మికలకు కీలకం. వాళ్లిద్దరి లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ మీద చాలా ట్రోలింగ్ జరిగింది. సినిమాలో వాళ్లేంటో రుజువు చేసుకోవాల్సిందే. సినిమాకు చాలా మంచి టాక్ వస్తే తప్ప ఈ నెగెటివిటీని అధిగమించి ఆడటం కష్టం. ఈ చిత్రంతో కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రెండు చిత్రాలకు జులై 12ను పరీక్ష తేదీగా చెప్పొచ్చు. మరి బాక్సాఫీస్ పరీక్షలో ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాన్నందుకుంటాయో చూడాలి.

No comments:

Post a Comment