Tuesday, July 9, 2019

అతనిపై మహేష్‌ పెట్టుబడి పెడతాడా?

మహర్షి అత్తెసరు సినిమానే అయినా కానీ అదో అద్భుతం అన్న కలరిస్తూ వచ్చాడు మహేష్‌బాబు. ప్రస్తుత పరిస్థితుల్లో పరాజయాన్ని అఫోర్డ్‌ చేయలేడు కనుక ఈ చిత్రాన్ని తిమ్మిని బమ్మిని చేసి చూపించారనే కామెంట్లు పడ్డాయి. అయితే మహేష్‌ మాత్రం ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లిని జెన్యూన్‌గానే మోస్తూ వచ్చాడు. అతడిని ట్రిప్‌కి వెంట పెట్టుకుని వెళ్లడం, వెంటనే మరో సినిమా చేస్తానని మాట ఇవ్వడంతో మహేష్‌ నిజంగానే అతడిని మెచ్చాడనేది అర్థమయింది. అయితే వంశీ పైడిపల్లికో దురలవాటు వుంది. అతని సినిమా ఎంత ఆడినా డబ్బులు తిరిగి రానంతగా ఖర్చు పెట్టించేస్తాడు. ఊపిరి చిత్రం అంత అద్భుతంగా వున్నా, నాగార్జున మార్కెట్‌కి తగ్గట్టు నలభై కోట్లు వసూలు చేసినా కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు. ఆ సంగతి నిర్మాత పివిపి ప్రకటించడమే కాకుండా నష్ట పరిహారంగా అతనితో మరో సినిమాకి సంతకం చేయించుకున్నాడు. అలాగే మహర్షిలో అతనూ భాగస్వామి అయ్యాడు. మహర్షి చిత్రానికి కూడా అధికంగా ఖర్చు పెట్టించడం వలన అంత బిజినెస్‌ జరిగినా నిర్మాతలకి లాభాలే రాలేదని చెప్పుకున్నారు. ఇకపై తన సినిమాలకి నిర్మాణ భాగస్వామి కావాలని నిర్ణయించుకున్న మహేష్‌ మరి వంశీ ట్రాక్‌ రికార్డ్‌ తెలిసాక కూడా అతని సినిమాకి కూడా నిర్మాణంలో భాగం తీసుకుంటాడా? 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి పెట్టినట్టుగా ఖచ్చితమైన బడ్జెట్‌ ఇచ్చి అందులోనే సినిమా పూర్తి చేయాలంటాడా? మహేష్‌ మాట ఎలా వున్నా కానీ వంశీ పైడిపల్లితో మళ్లీ అతనో సినిమా చేయడాన్ని ఫాన్స్‌లో చాలా మంది హర్షించడం లేదు.

No comments:

Post a Comment