Tuesday, July 2, 2019

విజ‌య‌సాయిని ట్వీట్ల‌తో ఉతికి ఆరేసిందిగా?

మ‌ర్యాద‌ల్ని ప‌క్క‌న పెట్టేద్దాం. రాజ‌కీయ శత్రుత్వం ముందు మరేదీ ముఖ్యం కాద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడైన విజ‌యసాయి ట్వీట్లు చూస్తే.. అందులో వాడే భాష కాస్తంత మొర‌టుగా అనిపిస్తుంది.

చంద్ర‌బాబును.. లోకేశ్ ను తిట్ట‌ట‌మే ప‌నిగా పెట్టుకోవ‌ట‌మే త‌ప్పించి మ‌రింకేమీ క‌నిపించ‌దు. ప్ర‌తి విష‌యంలోనూ ఏదో ఒక రంధ్రాన్వేష‌న చేయ‌టం క‌నిపిస్తుంది. విజ‌య‌సాయి మాదిరి దూకుడుగా రియాక్ట్ అయ్యే వారు తెలుగుదేశం పార్టీలో ఒక్క‌రు కూడా లేరా? అన్న దిగులు ప‌లువురి మాట‌ల్లో వినిపించేది. ఇప్పుడా కొర‌త తీరిపోయిన‌ట్లేన‌ని చెబుతున్నారు.

టీడీపీ అధినేత‌పై నిత్యం ఏదో రీతిలో విరుచుకుప‌డే విజ‌యసాయి ట్వీట్ల‌కు షాకిచ్చేలా రియాక్ట్ అయ్యారు ఒక‌ప్ప‌టి సినీ న‌టి.. తాజాగా టీడీపీ అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్న దివ్య‌వాణి. ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని హెరిటేజ్ సంస్థ డ‌బ్బుతో క‌ట్టారా? అంటూ విజ‌య‌సాయి చేసిన ట్వీట్ కు అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ట్వీట్లు చేసే విష‌యంలో విజ‌య‌సాయి వాడే భాష‌కు త‌గ్గ‌ట్లే దివ్య‌వాణి వాయిస్ ఉంద‌ని చెప్పాలి. తాజాగా ఆమె చేసిన ట్వీట్ లో అయ్యా..అక్ర‌మ సాయిరెడ్డిగారూ.. రంజాన్ పేరుతో 6వేల మందికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున భోజ‌నాలు పెట్ట‌టానికి జీవో నెంబ‌రు 1206 ద్వారా రూ.1.1 కోట్లు మంజూరు చేశారు.. ఆ సొమ్ము సండూర్ ప‌వ‌ర్ కంపెనీ సొత్తా?  అని ప్ర‌శ్నించారు.

అక్క‌డితో ఆగ‌ని ఆమె మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్ని తెర మీద‌కు తెచ్చారు. జ‌గ‌న్ గారి ఇంటి ముందు 1.3కిలోమీట‌ర్ల రోడ్డు వేయ‌టానికి రూ.5 కోట్లు మంజూరు చేశారు. అది భార‌తి సిమెంట్స్ నుంచి ఖ‌ర్చు చేస్తారా? అని ప్ర‌శ్నించ‌టం ద్వారా జ‌గ‌న్ సారు వారు పెట్టే ఖ‌ర్చు లెక్క‌ల్ని భ‌లేగా బ‌య‌ట‌పెట్టేశార‌ని చెప్పాలి. ప్ర‌మాణ‌స్వీకారం వేళ ఆచితూచి ఖ‌ర్చు చేశారంటూ సాగిస్తున్న ప్ర‌చారానికి కౌంట‌ర్ గా దివ్య‌వాణి పంచ్ అదిరింద‌న్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఘాటుగా రియాక్ట్ అయ్యే వారు అవ‌స‌ర‌మ‌ని.. అధికారం ఉన్న వేళ‌.. ప‌దవుల్ని అనుభ‌వించిన నేత‌లు దివ్య‌వాణి లాంటి నేత‌ల్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాల‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. 
Source : https://telugu.gulte.com

No comments:

Post a Comment