Tuesday, July 2, 2019

అమ్మడిది గోల్డెన్‌ లెగ్గే... కానీ!


కేరళ నుంచి దిగుమతి అయిన హీరోయిన్లలో నివేదా థామస్‌ కూడా ఒకరు. నిత్యామీనన్‌లా వుందనే ప్రశంసలు అందుకున్న నివేద మొదటి సినిమాలోనే గొప్ప నటి అని కూడా నిరూపించుకుంది. నానితో వరుసగా జెంటిల్‌మేన్‌, నిన్ను  కోరి చిత్రాలతో సూపర్‌హిట్లు అందించిన నివేదకి ఎన్టీఆర్‌ సరసన నటించే అవకాశం దక్కింది. జై లవకుశలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా కానీ స్టార్‌ హీరోల సరసన ఫిట్‌ అవదనేది తేలిపోయింది. జై లవకుశ అంతంతమాత్రంగా ఆడడంతో ఇక ఆమెకి పెద్ద సినిమాలనుంచి పిలుపు రాలేదు.

అదే సమయంలో జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌ అనే చెత్త చిత్రంలో నటించి పేరు చెడగొట్టుకుంది. అయినా కానీ డీలా పడకుండా మంచి అవకాశాలు వచ్చే వరకు ఎదురు చూసి 118తో బ్రోచేవారెవరురా చిత్రాలు అంగీకరించింది.

118 సక్సెస్‌ కాగా, బ్రోచేవారెవరురా కూడా విజయపథంలో సాగుతోంది. చేసిన సినిమాల్లో ఒకటే ఫ్లాప్‌ కావడంతో పాటు చిన్న సినిమాలకి మంచి ఆప్షన్‌గా నివేద కనిపిస్తోంది. ఈ ఏడాది వచ్చిన విజయాలతో ఆమెకి డిమాండ్‌ పెరిగింది. 'వి' చిత్రంతో ముచ్చటగా మూడోసారి నానితో జంట కట్టిన నివేదకి ఈ చిత్రంతో కూడా విజయం దక్కితే ఇప్పుడున్న డిమాండ్‌ మరింత పెరిగి ఆమె పారితోషికం కూడా రెట్టింపవుతుంది. ఇటు తెలుగు సినిమాలతో బిజీగా వున్నా కానీ అటు మలయాళ, తమిళ చిత్రాలలో వచ్చే అవకాశాలని కూడా నివేద వదులుకోకుండా క్రేజ్‌ వుండగానే క్యాష్‌ చేసుకుంటోంది.



No comments:

Post a Comment