Friday, July 19, 2019

రాఘవేంద్రుడికి ఏకలవ్య శిష్యుడి సాయం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొంత విరామం తర్వాత మళ్లీ సినిమా తీయబోతున్నారు. కాకపోతే ఇది ఆయన దర్శకుడిగా చేస్తున్న సినిమా కాదు. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం. ముగ్గురు హీరోలు.. ముగ్గురు హీరోయిన్లు నటించే ఈ చిత్రం మూడు సెగ్మెంట్లుగా ఉండబోతోంది.

ఇందులో ఒక్కో సెగ్మెంట్‌ను ఒక్కో దర్శకుడు డైరెక్ట్ చేస్తాడు. రెండు సెగ్మెంట్లకు దర్శకులుగా క్రిష్, ప్రకాష్ కోవెలమూడి ఖరారైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఒక హీరోగా నాగశౌర్య ఓకే అయినట్లు సమాచారం. ఈ సినిమా స్క్రిప్టులో చాలామంది ప్రమేయం ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న అనిల్ రావిపూడి సైతం స్క్రిప్టులో భాగస్వామి అయ్యాడట.

అనిల్.. రాఘవేంద్రరావుకు ఏకలవ్య శిష్యుడని చెప్పొచ్చు. పలు సందర్భాల్లో రాఘవేంద్రుడి గురించి గొప్పగా మాట్లాడాడు. తాను సినిమాల్లోకి రావడానికి ఆయనే స్ఫూర్తి అన్నాడు. దర్శకేంద్రుడు తీసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తనపై చూపించిన ప్రభావం గురించి కూడా చెప్పుకున్నాడు. అనిల్ ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే తీస్తాడన్న సంగతి తెలిసిందే.

వీటికి రాఘవేంద్రుడు కేరాఫ్ అడ్రస్ అని తెలిసిందే. తనకు స్ఫూర్తిగా నిలిచిన దర్శకేంద్రుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో అనిల్ భాగస్వామి అయ్యాడట. ఈ చిత్రంలో ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కూడా నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తుండటం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

No comments:

Post a Comment