Thursday, August 10, 2017

బోయపాటి పాకెట్ మనీ మాత్రమే..

బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అందులోనూ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక బోయపాటి ‘జయ జానకి నాయక’ చేయడం మరీ ఆశ్చర్యం. భారీ పారితోషకానికి టెంప్ట్ అయ్యే బోయపాటి ఈ సినిమా చేశాడన్న అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఆ పారితోషకం పది కోట్లని.. పన్నెండు కోట్లని రకరకాల ప్రచారాలు కూడా ఉన్నాయి. దీనిపై బోయపాటి స్పందించాడు. కేవలం మాట కోసమే తప్ప.. పారితోషకానికి ఆశపడి సినిమా చేయలేదన్నాడు. ‘‘మన రక్తానికి ఓ రంగు.. మన మాటకు ఓ విలువ.. మనకు ఓ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. ‘సరైనోడు’ తర్వాత నాకు చాలా పెద్ద ఛాన్సులొచ్చాయి. కానీ ఎప్పుడో సాయి శ్రీనివాస్‌తో సినిమా చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికే ‘జయ జానకి నాయక’ చేశా. అలాగని ఏదో మొక్కుబడిగా సినిమా చేయాలని అనుకోలేదు. అతడి కెరీర్‌కు ఉపయోగపడేలా పెద్ద స్థాయిలోనే సినిమా చేయాలనుకున్నా. చేశా. పారితోషకం విషయానికొస్తే.. చాలా తక్కువ తీసుకున్నా. మామూలుగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే కూడా తక్కువే. కరెక్టుగా చెప్పాలంటే అది నాకు పాకెట్ మనీ లాంటిది. నేను డబ్బుల కోసమే సినిమాలు చేయను. డబ్బు కంటే మాట ముఖ్యం’’ అని బోయపాటి అన్నాడు.

No comments:

Post a Comment