Wednesday, July 3, 2019

దగ్గుబాటి రానా పోయి పోయి అతడితో పెట్టుకుంటున్నాడా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ భాషలో నటించినా జనాలు ఆమోదించే నటుల్లో దగ్గుబాటి రానా ఒకడు. ‘బాహుబలి’తో అతడికి అలాంటిలాంటి గుర్తింపు రాలేదు. దాన్ని నిలబెట్టుకుంటూ వివిధ భాషల్లో ఆసక్తికర సినిమాలు చేస్తున్నాడతను. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ డైరెక్షన్లో అతను చేస్తున్న ‘హాథీ మేరీ సాథీ’ ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్య కశ్యప’ కూడా పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనుంది.

హిందీలో కూడా ఆసక్తికర చిత్రాలు లైన్లో పెడుతున్నాడతను. రానా కోసం మరింతమంది మంచి దర్శకులు లైన్లో ఉన్నారు. ఐతే అతను ఒక వివాదాస్పద తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలు తీసిన పా.రంజిత్.

కెరీర్ ఆరంభంలో ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ లాంటి చక్కటి సినిమాలు తీశాడు రంజిత్. అతడి ప్రతిభ చూసి రజనీ సినిమా చేయడానికి ముందుకొస్తే.. ‘కబాలి’, ‘కాలా’ తీసి పెట్టాడు. తొలి రెండు సినిమాల్లో రంజిత్ చూపించిన ముద్ర ఇందులో ఎంతమాత్రం కనిపించలేదు. దళిత్ ఐడియాలజీనంతా సినిమాలో చూపించాలని ట్రై చేసి ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేశాడు. ఈ విషయంలో అతను ఎక్స్‌ట్రీమ్‌కు వెళ్లిపోవడం మెజారిటీ ప్రేక్షకులకు రుచించలేదు. ‘కాలా’ తర్వాత మరో సినిమా తీయని అతను.. బయట మాత్రం అనేక వివాదాలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు.

దళితులపై వివక్షకు సంబంధించి రంజిత్ తరచుగా అగ్రెసివ్ కామెంట్స్ చేస్తుంటాడు. ఇటీవల ఒక సినిమా వేడుకలో అతను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కొన్ని కులాల్ని రెచ్చగొట్టేలా అతను మాట్లాడాడు. అతడి అరెస్టు వరకు వ్యవహారం వెళ్లింది. సినిమాలు తీయడంలో రంజిత్ ఇప్పటికే పట్టు కోల్పోయాడు. వ్యక్తిగత వివాదాలకు లెక్కే లేదు. ఇలాంటి దర్శకుడితో రానా సినిమా చేస్తున్నాడనగానే అతడి అభిమానులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జీవిత కథతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో రానాతో పాటు తమిళ నటులు ఆర్య, సత్యరాజ్ కూడా నటించబోతున్నారని అంటున్నారు.

No comments:

Post a Comment