Thursday, July 4, 2019

విక్రమ్ కుమ్మి అవతల పడేశాడు

అప్పుడెప్పుడో దశాబ్దంన్నర కిందట ‘అపరిచితుడు’ చిత్రంతో చివరగా హిట్టు కొట్టాడు విక్రమ్. ఆ తర్వాత సక్సెస్ కోసం అతను చేయని ప్రయత్నం లేదు. తన శైలిలో ప్రయోగాలు చేసినా.. మధ్య మధ్యలో మాస్ మసాలా సినిమాలు ట్రై చేసినా.. ఏదీ ఫలితాన్నివ్వలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన ‘సామి స్క్వేర్’ కూడా డిజాస్టరే అయింది. ఐతే విక్రమ్ కొత్త సినిమా అతడి కరవు తీర్చేలాగే కనిపిస్తోంది. ఆ సినిమా పేరు.. కదరం కొండాన్.

లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఆయన శిష్యుడు రాజేష్ సెల్వ రూపొందించిన చిత్రమిది. చాలా ఏళ్లుగా కమల్ దగ్గర పని చేస్తున్న రాజేష్.. ఇంతకుముందు తన గురువుతోనే ‘చీకటి రాజ్యం’ సినిమా చేశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది.  ‘చీకటి రాజ్యం’ ఓ ఫ్రెంచ్ థ్రిల్లర్ కు అఫీషియల్ రీమేక్. ఇప్పుడు విక్రమ్‌తో రాజేష్ చేసిన సినిమా హాలీవుడ్ మూవీ ‘డోంట్ బ్రీత్’కు రీమేక్ అట.

రీమేక్ అనే సంగతి పక్కన పెట్టి చూస్తే ‘కదరం కొండాన్’ ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని కథాంశం, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో వావ్ అనిపించింది ఈ చిత్ర ట్రైలర్. ఇక విక్రమ్ అయితే స్టన్నింగ్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీతో అదరగొట్టేశాడు. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్ మూవీ అని అర్థమవుతోంది. ఏ కోణంలో చూసినా హాలీవుడ్ సినిమా ఫీలింగే కలిగిస్తోంది ట్రైలర్. విక్రమ్ ఇందులో క్రిమినల్స్ పట్ల రూత్‌లెస్‌గా వ్యవహరించే సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తున్నాడు.

కమల్ తనయురాలు అక్షర ఓ కీలక పాత్ర చేసింది. శ్రీనివాసన్ గుత్తా ఛాయాగ్రహణం సమకూర్చగా.. కమల్‌కు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిన జిబ్రాన్.. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. తెలుగులో ‘మిస్టర్ కేకే’గా అనువాదమైన ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment