Saturday, July 20, 2019

థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు

తెలుగు సినిమా చరిత్ర చూస్తే కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన హీరోలు, దర్శకులు ఉన్నారు. యాక్షన్ సినిమాలు బాగా తీయగలిగే, చేయగలిగే వాళ్లూ ఉన్నారు. ప్రేమకథలు.. కామెడీ.. ఇలా రకరకాల .జానర్లలో మెరిసిన వాళ్లున్నారు. కానీ థ్రిల్లర్ సినిమాల్ని నిలకడగా బాగా తీసిన వాళ్లు, వాటిలో మెరిసిన హీరోలు దాదాపుగా కనిపించరు. ఐతే అడివి శేష్ అనేవాడు ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు.

ఈ జానర్‌కు రెఫరెన్స్‌గా తీసుకునే స్థాయిలో అతను సినిమాలు చేస్తున్నాడు. శేష్ హీరోగా, దర్శకుడిగా పరిచయం అయిన ‘కర్మ’ సినిమా థ్రిల్లర్ లక్షణాలున్నదే. ఐతే అప్పటికి అనుభవం లేక ఆ సినిమాను సరిగా డీల్ చేయలేకపోయాడు శేష్. ఐతే ‘క్షణం’ సినిమాతో అతను తనేంటో రుజువు చేశాడు. ఈ సినిమాకు స్క్రిప్టు సమకూర్చింది అతనే. ఆ సినిమా ఎంత ఉత్కంఠభరితంగా సాగుతుందో తెలిసిందే. ఇందులో నటనతోనూ శేష్ మెప్పించాడు. ఈ సినిమాతో అతడిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వాటికి తగ్గట్లే ‘గూఢచారి’ రూపంలో మరో సూపర్ థ్రిల్లర్ అందించాడు.

ఈ సినిమాతో మరిన్ని మెట్లు ఎక్కేశాడు. ఇప్పటికే ‘గూఢచారి’ సీక్వెల్ అనౌన్స్ చేసిన శేష్.. కచ్చితంగా మరోసారి మెప్పిస్తాడనే అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే శేష్.. ఏ అనౌన్స్‌మెంట్ లేకుండా చడీచప్పుడు లేకుండా ‘ఎవరు’ అనే మరో థ్రిల్లర్ మూవీ చేశాడు. దాని టీజర్ తాజాగా రిలీజైంది. అది చూస్తే సినిమా ఉత్కంఠభరితంగా సాగేలా కనిపిస్తోంది. ఇది కూడా థ్రిల్లర్ ప్రియుల్ని ఆకట్టుకుంటుందని.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధిస్తుందని అనిపిస్తోంది.

మొత్తానికి శేష్ పేరు చెబితే ఉత్కంఠభరిత థ్రిల్లర్ సినిమాలే గుర్తుకొస్తున్నాయి. ఈ జానర్‌పై అతడికి తిరుగులేని పట్టు ఉన్నట్లుండి. రాబోయే రెండు సినిమాలు కూడా ఆడితే టాలీవుడ్లో థ్రిల్లర్ సినిమాల పితామహుడిగా శేష్‌ను పిలుచుకోవచ్చేమో.

No comments:

Post a Comment