Tuesday, February 4, 2020

భీష్మ డైరెక్టర్‌ గాలి తీసేసిన శౌర్య

నితిన్‌తో వస్తోన్న భీష్మ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తోన్న వెంకీ కుడుముల తన తొలి చిత్రాన్ని నాగశౌర్యతో చేసాడు. 'ఛలో'తో సూపర్‌హిట్‌ కొట్టిన వెంకీ ఇప్పుడు రెండవ చిత్రంతోను ఘన విజయాన్ని సాధిస్తాననే ధీమాతో వున్నాడు. త్రివిక్రమ్‌ శిష్యుడైన వెంకీకి తొలి అవకాశం ఇచ్చిన శౌర్య అతని గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఛలో చేయడానికి ముందు తనతో నాలుగేళ్ల పాటు వెంకీ తిరిగాడని, ఒక కథ తెచ్చుకుంటే నిర్మాతని తానే సెట్‌ చేస్తానని ఊరు వెళ్లిపోయిన వాడిని తిరిగి పిలిపించానని, అతను తెచ్చిన కథ చాలా దరిద్రంగా వుందని, ఇలాంటి కథ తెచ్చావేంటని తిట్టి తనతో కలిసి కూర్చుని ఛలో కథ రాసానని నాగశౌర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

రచయితగా క్రెడిట్‌ కూడా తీసుకోలేదని, అది తన తప్పేనని, వెంకీని సక్సెస్‌ చేయడం కోసం స్వీయ నిర్మాణంలో ఛలో చేసామని, తీరా సినిమా విడుదలయ్యాక తన కాల్స్‌ కూడా అతను అటెండ్‌ అవలేదని, అతనికి గిఫ్ట్‌గా తన తల్లి ఇచ్చిన కార్‌ని కూడా అతను వాడలేదని, అసలేమైందనేది తనకు తెలియదు కానీ ఇక మళ్లీ వెంకీ కుడుముల తన దగ్గరకు వచ్చినా తాను రానివ్వనని శౌర్య అన్నాడు.

మరో రెండు వారాలలో భీష్మ రిలీజ్‌ వుందనగా వెంకీపై శౌర్య చేసిన కామెంట్స్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం వెంకీ బయటకు వస్తాడు కనుక మరి దీనిపై అతని వెర్షన్‌ ఏమిటనేది అప్పుడు తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఇలాంటి అభిప్రాయబేధాలు కామనే కానీ ఇలా పబ్లిక్‌ అవడమే చాలా అరుదు.

No comments:

Post a Comment