Tuesday, July 2, 2019

పూరి తమ్ముడికి వైకాపా సపోర్ట్

పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. పూరి స్వయంగా తమ్ముడితో సినిమా తీయడంతో పాటు అతను నటించిన కొన్ని సినిమాలకు స్క్రిప్టు ఇచ్చి నిర్మాతగానూ వ్యవహరించాడు. అయినా అతను సక్సెస్ కాలేదు. సోలో హీరోగా ‘బంపరాఫర్’ మినహాయిస్తే చెప్పుకోదగ్గ హిట్ లేదు సాయిరాం శంకర్‌కు.

తన సినిమాల్ని అసలు జనాలు పట్టించుకోని స్థితిలో అతను కొంత కాలంగా బ్రేక్‌లో ఉన్నాడు. ఐతే ఈ విరామం తర్వాత అతను మళ్లీ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడట. కృష్ణ అనే కొత్త దర్శకుడు తీయబోయే థ్రిల్లర్ చిత్రంలో సాయిరాం నటించబోతున్నట్లు సమాచారం. ఇక్కడి వరకు చూస్తే ఇందులో విశేషం ఏమీ లేదు.

ఈ సినిమాను నిర్మించబోయేది ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని సమాచారం. ఆ పార్టీ నాయకులు ఇంకొందరు ఈ సినిమా వెనుక ఉన్నారట. పూరి కుటుంబానికి వైకాపాతో మంచి అనుబంధమే ఉంది. పూరి చాలా ఏళ్లుగా వైకాపా మద్దతుదారుడిగా ఉన్నాడు. ఆయన తమ్ముడు ఉమా శంకర్ గణేష్ ఇటీవలి ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలోనే సాయిరాం కోసం వైకాపా వాళ్లు అండగా నిలవడానికి ముందుకు వచ్చారు.

ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నెమ్మదిగా సినీ పరిశ్రమలో ఆ పార్టీ నాయకులు ప్రాబల్యం పెరగొచ్చని అంచనాలున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నేత అయిన రాకేశ్ రెడ్డి ఎన్నికల ముంగిట రామ్ గోపాల్ వర్మతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment